నిర్మాతలను పైరసీ భూతం ఎంతగా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడు దర్శకనిర్మాతలకు మరోరకంగా కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్కి స్క్రిప్ట్ ను సోషల్ మీడియాలో పెడతామనే బెదిరింపులు ఎదురయ్యాయి. పూరీ ప్రస్తుతం రామ్ హీరోగా “ఇస్మార్ట్ శంకర్” అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో హైదరాబాద్కి చెందిన మురళీ కృష్ణ అనే వ్యక్తి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇస్మార్ట్ శంకర్ పూర్తి స్క్రిప్ట్ని ఇన్స్ట్రాగ్రామ్లో పెడతానని బెదిరించాడట. దీంతో అలెర్ట్ అయిన టీం హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది. పోలీసులు కొద్ది గంటలలోనే ఆ వ్యక్తిని పట్టుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు వేరే సైట్ నుండి స్క్రిప్ట్ తీసుకున్నానని, డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులకి చెబుతున్నాడట. దీనిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.నేది ఇప్పటివరకు తెలిసిన న్యూస్.
కానీ ఇప్పుడు నిందితుడు మురళికృష్ణ తాను వేరే సైట్ నుంచి ఆ స్క్రిప్ట్ కథ తీసుకున్నానని డబ్బులు డిమాండ్ చేయలేదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఇప్పటికి ఆ సైట్ లో ఆ కథ అలాగే ఉందని అన్నారు. కేవలం తాను దాన్నే తన పేజీలో పెట్టానని, ఆ చిత్రం ప్రమోషన్ టీమ్ అడగగానే తొలిగించామని చెప్పారు. అలాగే ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం పూరి టీమ్ చేస్తున్న చీప్ ట్రిక్ అన్నట్లుగా అభివర్ణించారు. దాంతో ఈ కేసు గురించి లోతైన విచారణ మొదలైంది.