మరోసారి భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. కొద్ది రోజుల నుంచి భారత్లో సెకండ్ వేవ్ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్ వేవ్ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
అయితే అక్టోబర్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ఎక్కువగా ప్రభావం చూపనుందని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది.
దేశంలో చిన్న పిల్లల ట్రీట్మెంట్ కోసం వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని ‘చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ’ పేరుతో పీఎంవోకు సమర్పించిన రిపోర్టులో నిపుణులు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు అవసరానికి సరిపోయే పరిస్థితి లేదని ఈ కమిటీ అభిప్రాయపడింది.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, దివ్యాంగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కమిటీ చెప్పింది. ఇప్పటికే 12 ఏళ్లు నిండిన చిన్నారుల కోసం జైకొవ్-డీ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చినా.. ఈ డ్రైవ్ ఇంకా ప్రారంభం కాలేదని కేంద్రానికి గుర్తు చేసింది.