అన్నకు ప్రేమతో రాఖీ కట్టిన చెల్లి ఆ తర్వాత కాసేపటికే అత్తింట్లో శవంగా కనిపించింది. విజయవాడలోని ఆరంబల్పేటలో ఈ సంఘటన జరిగింది. ఆమె రెండేళ్ల క్రితం ఫణి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి.. అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడు.. తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసుకుని షాక్కు గురయ్యాడు.
భర్త మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ చేస్తోంది. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన చెల్లిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపిస్తున్నాడు.
ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను హాస్పిటల్కు తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని భర్త, ఇతర బంధువులు చెబుతున్నారు. ఉష మృతిపై ఆమె కుటుంబసభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉష మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.