డిసెంబర్ 6వ తేదీ, 1992 వ సంవత్సరంలో యోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
ఈ కేసులో నిందితులుగా బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు సంఘ్ పరివార్ నేతలు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
నిందితులు ఎవరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని, దాంతో వారంతా నిర్దోషులేనని స్పష్టం చేసింది. తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశించగా 11 మంది హాజరుకాలేదు. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఉన్నారు. వారిలో విచారణ సమయంలో 17 మంది మృతి చెందారు.
తీర్పు వెల్లడించనంత వరకు 32 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 21 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారు కోర్టుకు వచ్చిన నేపథ్యంలో లక్నోలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిందితుల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్ కటియార్, పవన్ పాండే, సుధీర్ కక్కర్ వంటి వారు కూడా ఉన్నారు.