పైన ఎంత ఎండలు మండుతున్నా, టీ తాగే అలవాటు మాత్రం మారదు. అది కూడా పొద్దున్నే టీ తాగకపోతే రోజు ప్రారంభం కాదు, ముగియదు కూడా. అయితే బైట టీ స్టాళ్లు… పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎప్పుడూ బిజీగానే ఉంటున్నాయి. తెల్లారగానే టీ స్టాల్ వద్దకు వచ్చి, అక్కడ ఉండే పేపర్ చదువుతూ, తాజా రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ కాసేపు సమయాన్ని గడిపేవారు ఎంతో మంది ఉంటారు. అదీ ఈ ఎన్నికల సమయంలో టీ స్టాల్ వద్ద పిచ్చాపాటిగా మాట్లాడుకునేవి రాజకీయాలే.. అది వినీవినీ విసుగొచ్చిన ఒక టీ స్టాల్ యజమాని ఏమి చేశాడంటే; తన స్టాల్ వద్ద టీ తాగండి కానీ, రాజకీయాలు మాట్లాడవద్దు అని బోర్డు పెట్టేశాడు. అదే ఈ స్టాల్ ప్రత్యేకం. ఇక్కడ రాజకీయాల గురించి ఎవరూ మాట్లాడకూడదు.
ఈ వినూత్న టీ స్టాల్ కర్ణాటకలోని మాండ్యాలో ఉంది. వడిరాజ కాఫీ సెంటర్ గా దీన్ని పిలుస్తారు. ఈ స్టాల్ కు సినీ నటులు సుమలత, నిఖిల్ గౌడ్ అభిమానులు వచ్చి టీ తాగి వెళుతుంటారు. వారు గొడవలు పడిన సందర్భాలు, వారిని విడిపించిన సందర్భాలు ఉన్నాయని అంటాడు స్టాల్ యజమాని. ఎన్నికల వేళ రాజకీయాలు మాట్లాడుతుంటే మరిన్ని గొడవలు వస్తాయన్న ఉద్దేశంతోనే తాను ఈ బోర్డు పెట్టినట్టు చెబుతున్నాడు స్టాల్ యజమాని.