అసెంబ్లీలో సమస్యలపై చర్చించే ధైర్యం టీడీపీకి లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో చంద్రబాబు తీరు దారుణమని, సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏ అంశంపై చర్చించేందుకు కూడా టీడీపీ సిద్ధంగా లేదని విమర్శించారు. సభలో ప్రాజెక్టులపై మాట్లాడదామంటే చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు. ఉల్లిధరలపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
సభలో గొడవలు చేసేందుకే టీడీపీ అధిక సమయం వెచ్చిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ తో చంద్రబాబు ప్రవర్తించిన తీరు వీడియోలో స్పష్టంగా ఉందని వెల్లడించారు. మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసిన తప్పులపై క్షమాపణ చెప్పిన తర్వాతే టీడీపీ సభ్యులు సభలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు.