నేడు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా, సుమారు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబు తెలిపారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారని తెలిపారు. ప్రభుత్వం తరపున శనివారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య పట్టు వస్ర్తాలను మంత్రులు సమర్పిస్తారన్నారు. శుక్రవారం వరకు అమ్మవారిని 5.18 లక్షల మంది దర్శించుకున్నారన్నారు. రూ.1.80 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు తెలిపారు.
శుక్రవారం మహాలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారిని సుమారు 80వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో చెప్పారు. మూలా నక్షత్రం సందర్భంగా శనివారం తెల్ల వారుజామున 2 గంటల నుంచి దర్శనం ప్రారంభించి, భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు అందించనున్నట్లు ఈవో చెప్పారు. మూలానక్షత్రం రోజు 3 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, 30 వేల మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.