లోకసభ చివరి విడత ఎన్నికలు ఎనిమిది రాష్ట్రాల్లో ఈనెల 19న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖమంత్రి, బీజేపీ లోక్సభ అభ్యర్థి రాజ్నాథ్ సింగ్ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు.లక్నోలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలకు దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ విసిరారు.
గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ మధ్య ఎన్నికల పోరు జరిగింది.ఈసారి ప్రతిపక్షాలకు సరైన ప్రధాని అభ్యర్థి కూడా లేరని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ జాతీయ స్థాయిలో మెరగైన ఫలితాలను సాధిస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్తో కూడిన కూటమి పార్టీలపై ప్రజలకు నమ్మకంలేదన్నారు. ఆఖరిదశ పోలింగ్ తేదీ దగ్గరపడుతోందని.. ఇకనైనా దాగుడుమూతలు ఆపి మీ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పాలని విపక్షాలకు సవాలు విసిరారు.