తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేతల పై మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కకులకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని మంత్రి ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతి బాగుంటుందని అంటున్న ఉత్తమ్, ఈవీఎంలు ఉన్నప్పుడు గెలవలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను ఆ పార్టీ కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు.
దేశంలో ఉగ్రవాదం పెరగడానికి భారతీయ జనతా పార్టీయే కారణమని ఆరోపించారు. ఓట్ల కోసం సున్నితమైన అంశాలను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పోలీసుల మనో స్థయిర్యం దెబ్బతీసేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని ఎంఐఎంతో ముడిపెట్టడం సబబు కాదని బీజేపీ నేతలకు హితవు పలికారు.