భారతజట్టు ఒలింపిక్స్ క్వాలిఫయిర్ రెండో మ్యాచ్లో రష్యాను 7-1 తేడాతో మట్టికరిపించింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్కు భారత పురుషుల హాకీ జట్టు అర్హత సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే రష్యా ఆటగాడు అలెక్సీ గోల్ కొట్టి భారత్కు షాక్ ఇచ్చాడు. తొలి క్వార్టర్ ముగిసేసరికి మన్ప్రీత్ సేన 0-1తో వెనుకంజలో నిలిచింది. రెండో క్వార్టర్ ఆరంభమైన కొద్దిసేపటకే హార్దిక్ (17వ ని”) గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడలేదు. 23, 29వ నిమిషంలో అక్షదీప్ సింగ్ వరుస గోల్స్తో హోరెత్తించాడు.
దీంతో అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3-1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం 47వ నిమిషంలో నీలకంఠ శర్మ, 48వ నిమిషంలో రుపిందర్ సింగ్ గోల్స్ కొట్టడంతో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. ఆఖర్లో భారత్ మరింత పుంజుకొని రెండు గోల్స్ కొట్టి మ్యాచ్ను 7-1 తేడాతో ముగించింది. ఇదే వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్ మొదటి మ్యాచ్లో మన్ప్రీత్ సేన రష్యాను 4-2 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.