అమరావతిలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో అడుగుపెట్టిన చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు హైదరాబాద్కు పంపిన విషయంపై టీడీపీ నేతల నుంచి విమర్శలు వస్తుండడంతో కొడాలి నాని స్పందించారు.
విశాఖ పట్నం ప్రజలు చంద్రబాబుకు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులతో స్వాగతం పలికారని నాని అన్నారు.అభివృద్ధికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తన తీరును ఇలాగే కొనసాగిస్తే కుప్పంలో కూడా ఆయనకు ఓటమి తప్పదని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుట్రల నుంచి టీడీపీ శ్రేణులు బయటకు రావాలని విమర్శించారు.