కరోనా వల్ల తలెత్తిన సమస్యలపై ఏపీ సీఎం జగన్ తో తాను మాట్లాడినట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కరోనా సాయం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.179 కోట్లు ఇచ్చామని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.918 కోట్లు జమ చేశామని తెలిపారు. మహిళలకు రూ.300 కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు రూ.196 కోట్ల సాయం చేశామని వివరించారు.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకు రూ.550 కోట్లు ఇచ్చామని చెప్పారు.గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. గుజరాత్ సీఎంతో అమిత్ షా మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారని చెప్పారు. 4,069 మంది ఏపీ మత్స్యకారులను పంపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.కరోనా తీవ్రత మేరకు లాక్డౌన్ వంటి అంశాలపై మార్పులు, చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని కిషన్ రెడ్డి అన్నారు.