గతంలో ఒకసారి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో భారీ పగుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. అప్పుడే ఏ భూకంపమో అనుకుని ప్రజలు భయపడ్డారు. అయితే అది పక్కనే ఉన్న భారీ డంపింగ్ యార్డ్ వల్ల అని చెప్పుకొచ్చారు అక్కడి అధికారులు, నాయకులు. అదే విధంగా మరోసారి, పోలవరం ప్రాజెక్టు వద్ద భూమి పగుళ్లకు గురికావడం కలకలం రేపాయి. ప్రాజెక్టు స్పిల్వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. దీనితో ఆ సమీపంలో ఉన్న వాళ్లంతా ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారని తెలుస్తోంది.
సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రాజెక్టు అధికారులు.. ఘటనకు గల కారణాలపై విచారణ చేశారు. దీనికి సమీపంలోనే డంపింగ్ యార్డు ఉండడంతోనే పగుళ్లకు ఏర్పాడ్డాయని వాళ్లు చెబుతున్నారు. అలాగే, ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. నేడు సెలవు దినం కావడంతో ప్రాజెక్టును చూసేందుకు చాలా మంది వస్తారు. అయితే, ఈ పగుళ్లు సమయంలో యాత్రికులు లేరని తెలిసింది.
ఈ ఘటనలో విద్యుత్ స్తంభాలు కూడా పక్కకు పడిపోయాయి. రోడ్లు చీలిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో అధికారులు వెంటనే మరమ్మతులు చేశారు. ప్రాజెక్టు సమీపంలో ఇలాంటివి సహజమేనని అధికారులు చెబుతున్నారు.