సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వర్మ ప్రస్తుతం రెండు బయోపిక్లని రూపొందించే పనిలో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై “టైగర్ కేసీఆర్” అనే టైటిల్తో ఓ బయోపిక్ చేస్తుండగా, “శశికళ” పేరుతో కూడా బయోపిక్ రూపొందిస్తున్నాడు . అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడిపించారు అన్న నేపథ్యంలో వర్మ తెరకెక్కిస్తున్న “టైగర్ కేసీఆర్” చిత్రానికి సంబంధించి ఇటీవల టైటిల్ లోగో విడుదల చేశారు. టైటిల్కి “అగ్రెసివ్ గాంధీ” అనే క్యాప్షన్ తో పాటు “ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు” అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు. ఇక ఈ రోజు ఉదయం 11గం.లకి చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు వర్మ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. కేసీఆర్ పాత్రలో రంగస్థలం, మహానటి చిత్రాలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన మహేష్ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్మ మరో కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావు, వైఎస్సార్, జగన్, చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్ ఉంటారని తెలిపారు. వీరితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎంలు రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఉంటారని తెలిపారు.