ఏపీ సీఎం చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ కేంద్రంలో అధికారం చేపట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఓ వైపు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు జగన్ ను తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా వ్య్వాహరిస్తున్నట్టు అర్థమవుతోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె విశాఖపట్నంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, అవసరమైతే చంద్రబాబుకు దూరం కావడానికి కూడా ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. కేంద్రంలో నాన్ ఎన్డీఎ, నాన్ యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ నేతలంతా చర్చలు జరిపి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఆమె చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఫలితాలే కీలకం కానున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల నేతలంతా ఒకతాటి మీదికి వచ్చి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు.