అఖిలపక్ష సమావేశంలో “ప్రత్యేక హోదా”ను ప్రస్తావించింది టీడీపీ. అలాగే విభజన హామీలను నేరవేర్చాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాక్సిన్ అందుబాటులోకి తెచ్చినందుకు ప్రధానిని అభినందించామని… ఇప్పుడు ఇస్తున్న రోజుకు 5 లక్షల వాక్సిన్ లను మరింత పెంచాలని కోరామన్నారు. ఏపీ విభజన చట్టం లోని అంశాలపై చర్చ జరగాలని కోరామని… హామీల అమలుకు ఇంకా 3 ఏళ్లే మిగిలాయని గుర్తు చేశారు. “ప్రత్యేక హోదా”పై అనేక ప్రచారాలు చేస్తున్నారని, దానిపై స్పష్టత ఇవ్వాలని కోరామని తెలిపారు. అమరావతి రైతుల నిరసన, ఆందోళనను ఇంకా నిర్లక్షం చేస్తున్నారని… దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరామని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరగడంపై చర్యలు తీసుకోవాలని… దేవాలయాలపై దాడుల వెనుక ప్రతిపక్ష పాత్ర ఉందని విజయసాయి రెడ్డి ఆరోపణ సరికాదని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి ఆరోపణలపై మేము నిరసన తెలిపామని…మా అభ్యంతరాలను ప్రధాని మోడి నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.