నేడు భారత్ మూడు టీ20ల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో తలపడనుంది. గత ఏడాది చివర్లో వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను, మూడు వన్డేల సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తనపేర లిఖించుకున్న విరాట్… అంతర్జాతీయ టీ20 పరుగుల్లో సహచర ఆటగాడు రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ను అధిగమించే అవకాశం కోహ్లీ ముందుంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి-రోహిత్లు తలో 2,633 పరుగులు సాధించి టాప్లో కొనసాగుతున్నారు. నేటిమ్యాచ్లో రోహిత్ను కోహ్లీ అధిగమించడం ఖాయం. ఈ సిరీస్లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లీ సింగిల్గా అగ్రస్థానాన్ని చేజిక్కించు కుంటాడు. కేవలం పరుగు సాధిస్తే రోహిత్ను అధిగమించే కోహ్లీ.. లంకేయులతో టీ20 సిరీస్లో పరుగుల వేట కొనసాగిస్తే మాత్రం హిట్ మ్యాన్కు అందనంత దూరంలో నిలుస్తాడు.
విండీస్తో జరిగిన టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో 50 బంతుల్లో 94 పరుగులు సాధించిన కోహ్లి.. ఇక మూడో టీ20లో 29 బంతుల్లో అజేయంగా 70 పరుగులు సాధించాడు. దాంతో తాను మూడు ఫార్మాట్లకు సరిపోయే క్రికెటర్నని, అవసరమైతే తన హిట్టింగ్ ఇలా ఉంటుందంటూ విమర్శకుల నోళ్ల మూయించాడు. ఇదే ఫామ్ను శ్రీలంకతో జరుగనున్న పొట్టి ఫార్మాట్ సిరీస్లో కూడా కొనసాగించాలని యోచిస్తున్నాడు. టీమిండియాకు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు నెలల తర్వాత టీమిండియా జట్టుతో జతకట్టాడు. రోహిత్ శర్మ, మహ్మద్ షమిలకు విశ్రాంతినిచ్చిన బిసిసిఐ బుమ్రాను బరిలోకి దించింది. ఈ ఏడాదిలోనే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా దీనికి ముందు 15 మ్యాచ్లు మాత్రమే టీమిండియా ఆడాల్సి ఉంది. త్వరలో ఇండియన్ ప్రిమియర్లీగ్(ఐపిఎల్) కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదనే ఉద్దేశ్యంతో టీ20ల్లో ఎంపిక చేయడం జరిగింది. ఐపిఎల్లో బుమ్రా ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ను కాపాడుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. చానాళ్ల తర్వాత బుమ్రా శ్రీలంకతో టీ20లకు బరిలోకి దిగడంతో కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ అతని బౌలింగ్ను పరీక్షించాలని చూస్తున్నారు.