శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి మృతి చెందింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే అస్వస్థతకు గురయిన ఎలుగుబంటి రెస్య్కూ సెంటర్లో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఎలుగుబంటి మృతిపై కారణాలు తెలియాల్సి ఉందని జూ అధికారులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఆదివారం కిడిసింగిలో కిడిసింగి గ్రామానికి చెందిన కలమట కోదండరావును జీడితోటల వైపు వెళ్తుండగా ఎలుగుబంటి దాడి చేసి చంపింది. ఆ తర్వాత సోమవారం నాడు జీడీ తోటలో పనిచేస్తున్న తామాడ షణ్ముఖరావుపై ఎలుగు దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు యువకులు అప్పలస్వామి, చలపతిరావు, సంతోష్ షణ్ముఖరావును కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ముగ్గురిపై కూడా ఎలుగుబంటి గాయపరచడంతో ఉద్దానమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.