దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఘటనలు మాత్రం తగ్గడం లేదు. అత్యాచారం చేయడం, బయటకు తెలిస్తే ఏమౌతుందో అని చెప్పి చంపేయడం చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మామూలైపోయింది. ప్రతి రోజు దేశంలో 90 వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఒక అంచనా. అసలు ఈ పరిస్థితులకు దారితీస్తున్న కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతున్నదో తెలుసుకోవాలి. ఇటీవలే ఉన్నావ్ ఘటనలో యువతిని నిందితులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన మరవక ముందే మరో సంఘటన జరిగింది.
యూపీలోని బందా ప్రాంతంలో ఓ 18 ఏళ్ల యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆ యువతికి నిప్పు అంటించాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని యువతిని హాస్పిటల్ కు తరలించారు. యువతి శరీరం అప్పటికే 90శాతం కాలిపోయింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అత్యాచారం చేసిన నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. విచారణ చేసి కోర్టులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నది. ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలని ఇప్పటికే పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా వీలైనంతగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు.