భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, స్మృతి మంధాన ప్రతిష్ఠాత్మక విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. గతేడాది మూడు ఫార్మాట్లలో కలిపి 2735 పరుగులు చేసిన కోహ్లి పురుషుల విభాగంలో లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతడు ఈ ఘనత సాధించడం ఇది వరుసగా మూడోసారి.
2018లో జరిగిన వన్డేల్లో 669, టీ20ల్లో 662 పరుగులు చేసిన మంధాన మహిళల విభాగంలో అవార్డును దక్కించుకుంది. ఆమెకు ఇదే తొలి విజ్డెన్ అవార్డు. గత డిసెంబరులో ఐసీసీ అవార్డుల్లోనూ వీళ్లిద్దరు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ 1889 నుంచి క్రికెటర్లకు అవార్డులను ప్రధానం చేస్తోంది.