telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మొదటగా వ్యాక్సిన్‌ వారికే ఇస్తాం…

Kcr telangana cm

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానం పై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాలను వ్యక్త పరిచారు. “వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అనుగుణమైన కార్యాచరణ రూపొందించాం. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైన ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలు గా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలు, కోవిడ్ పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.

Related posts