మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్లో చేరిన ప్రణబ్.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రణబ్ ముఖేర్జీ మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ప్రణబ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్శన్ విజయశాంతి అన్నారు. “రాజనీతిజ్ఞులైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, మరెన్నో హోదాల్లో దేశానికి అందించిన సేవలతో భారతావని హృదయంలో ఎప్పటికీ చిరస్మరణీయులుగా నిలిచి ఉంటారు.ఆధునిక భారత రాజకీయాల్లో ఒక మార్గదర్శిగా శ్రీ ప్రణబ్ స్థానం ఎన్నటికీ సుస్థిరం. తమ నాయకత్వ పటిమతో ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను చక్కదిద్దిన మేధావి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని విజయశాంతి అన్నారు.
previous post
టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించింది: కిషన్ రెడ్డి