స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ. హనుమంతరావు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోతే… ప్రజలు క్షమించరని.. ప్రైవేటు కంపెనీలో రిజర్వేషన్లు ఉండవన్నారు. ఆదానీ, అంబానీ చేతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలుబొమ్మలా మారారని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్ భూములు కోట్ల రూపాయలు పలుకుతుందని పేర్కొన్నారు. ఆదానీ, అంబానీలతో మోడీ అవగాహన కుదుర్చుకున్నారని ఆగ్రహించారు. రేపు బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ అమ్మేస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడానికి పెద్ద ఉద్యమం చేయాలని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమం చేయాలని..లేకపోతే భవిష్యత్ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిన్న కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగబోదని కేంద్రం తేల్చేసింది. దీంతో ఏపీలోని అన్ని పార్టీలు దీనిపై భగ్గుమన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి.
previous post