అప్పులు తెచ్చి కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులు కడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అప్పు తెచ్చినా తిరిగి చెల్లించే స్థోమత రాష్ట్రానికి ఉందని స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లలో రూ.30లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలతో నీటి సమస్యలను పరిష్కరించామని చెప్పారు. సెక్షన్-3 కింద కేటాయింపులు జరపాలని ప్రధానికి ఇప్పటి వరకు 100 లేఖలు రాసినా స్పందనలేదని విమర్శించారు. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులనూ కలిశానన్నారు.
పాలమూరు-రంగారెడ్డిని 100 శాతం పూర్తి చేస్తామని, 8 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. నూతన మున్సిపాలిటీ చట్టం తీసుకొస్తామని, లంచం ఇవ్వకుండా మున్సిపల్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పానన్నారు. ధరణి వెబ్సైట్తో సమూల భూ సంస్కరణలు రానున్నాయని తెలిపారు. పాత పాస్బుక్లలో ఉన్న 33 అనవసర కాలమ్స్ ఎత్తేస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని వెల్లడించారు. నరేగా నిధులను గ్రామ పంచాయతీల ద్వారానే ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.