రైతులు మొన్నటిదాకా భూమి దున్ని పండించలేక, ఆత్మహత్య చేసుకున్న వార్తలు వచ్చేవి. కానీ, ఇటీవల లంచం ఇవ్వడానికి అడుక్కుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్న భూపాలపల్లి లో లంచం ఇవ్వడానికి వృద్ధ దంపతులు బిచ్చమెత్తిన ఘటన మరువక ముందే, మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఆజంనగర్కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. లంచం డబ్బులు ఇచ్చే స్తోమత లేని రైతు దంపతులు భిక్షాటన విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించి ఆర్డీవో ద్వారా సమస్య పరిష్కరించారు.లంచం అడిగిన తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇక తాజాగా, వీఆర్వోలకు లంచమివ్వాలి.. బిచ్చమెయ్యండి అంటూ ఫ్లకార్డులు పట్టుకుని వీధి వీధి తిరుగుతూ బిచ్చమెత్తారు ములుగు జిల్లా వెంకటాపూర్లో రైతులు. వెంకటాపూర్కు చెందిన కనుకుంట్ల రాజయ్య, బొమ్మెడ చిన్నసాంబయ్య, అనుముల దేవేందర్, మామిడి నర్సయ్యతోపాటు లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన డి. కృష్ణమూర్తి భిక్షాటన గురించి తెలిసిన తహసీల్దార్ దేవాసింగ్.. వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. పొలాల వద్దకు తీసుకెళ్లి వీఆర్వో, సర్వేయర్తో పరిశీలన చేయించారు. త్వరలో నే వారికి పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారు. వీఆర్వోలు, వీఆర్ఏలపై విచారణ జరిపిస్తామని తహసీల్దార్ తెలిపారు.