telugu navyamedia
సినిమా వార్తలు

“రాజబాబు జయంతి ఎందరికో మార్గదర్శకం కావాలి” – తమ్మారెడ్డి భరద్వాజ

నటీనటులు చనిపోయిన తరువాత వారి జయంతిని పదిమందికి స్ఫూర్తిగా నిర్వహించడం
ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని , నటుడు రాజబాబును ఇంతగా ప్రేమించే పిల్లలు ఉండటం అదృష్టమని నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు .


క్యారెక్టర్ నటుడు రాజబాబు 65వ జయంతి వేడుకలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సోమవారం జరిగాయి రాజబాబు కుమారులు రమేష్ చంద్ర , వీరన్న చౌదరి ,కుమార్తె శ్రీదేవి , స్నేహితులు కాకాని బ్రహ్మం , నాగేశ్వర రావు , భగీరథ, నర్రా వెంకట్ రావు , వేముల‌ప‌ల్లి కుమార్, బాలాజీ, సూర్య తేజ రాజబాబు జయంతి వేడుకలను నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో ఆరుగురికి రాజబాబు స్మారక అవార్డులు , తొమ్మిది మంది పేద కళాకారులకు ఆర్ధిక సహాయం అతిథుల ద్వారా అందించారు . ఈ సందర్భగా భరద్వాజ మాట్లాడుతూ .. రాజబాబు చాలా సౌమ్యుడు , అందరితో స్నేహపాత్రంగా ఉంటాడు , ఆయన మరణించిన తరువాత ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించడం ఆశ్చర్యంగా , ఆనందంగా ఉందని చెప్పారు .


తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె .ఎల్ .దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. స్వర్గస్తులైన వారిని స్మరిస్తూ కార్యక్రమాలు సంస్థలు ఎందుకు నిర్వహించవని మమ్మల్ని ప్రశ్నిస్తూ వుంటారు . ఆయా నటీనటుల కుటుంబ సభ్యులు ముందుకు వస్తే తాము చేయూత నిస్తామని, అందుకు రాజబాబు కుటుంబం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.. సినిమా రంగంలో ఇది చాలా మంచి సంప్రదాయమని , అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు .


తెలుగు చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. గతం లో తాము సంతాప సభలు , జయంతి వేడుకలు నిర్వహించామని .. అయితే ఇలాంటి స్పంద‌న మాత్రం తాను చూడలేదని చెప్పారు . రాజబాబు చనిపోయిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు , స్నేహితులు నిర్వహించిన ఈ వేడుక మాత్రం చాలా స్ఫూర్తి కలిగిస్తుందని , ఆయన పేరుతో స్మారక అవార్డులు ఇవ్వడంతో పాటు , పేద కళాకారులకు ఆర్ధిక సహాయం చెయ్యడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .


“మా ” ఉపాధ్యక్షులు డాక్టర్ మాదాల రవి మాట్లాడుతూ , రాజబాబు మంచి స్నేహశీలి , ఆయనతో ఒక్కసారి పరిచయం అయితే ఎవరూ మర్చిపోలేరు . ఆయన జయంతి వేడుకలను ఇలా స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు .


దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు , డాక్టర్ ఎమ్ .వినోద్ బాల, రామ్ జగన్, కృష్ణ భగవాన్ , శ్రీమతి శివ పార్వతి , శివన్నారాయణ రాజబాబుతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు .


రాజబాబు జయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడు కాకాని బ్రహ్మం మాట్లాడుతూ ..తనకు రాజబాబు అత్యంత సున్నిత మిత్రుడని , అలాంటి మిత్రుడు ఇంత త్వరగా దూరమవుతాడని ఎప్పుడు అనుకోలేదని , రాజబాబు జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని చెప్పారు.

సినిమా రంగంలో కోట్లు సంపాదించి పోయినవారు ఎందరో వున్నారు .అయితే వారి జయంతిని ఒక వేడుకలా జరుపుదామనే భావన చాలా మందిలో లేదు . రాజబాబు లాంటి చిన్న నటుడు ను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని ఇలా ఘనంగా నిర్వహించిన వారి కుటుంబ సభ్యులను మనసారా అభినందిస్తున్న అని భగీరథ చెప్పారు .

ఒక వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నామని , ఇందుకు అందరూ సహకరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు . అనంతరం శ్రీమతి శివ పార్వతి , శ్రీమతి సుహాసిని ,శ్రీమతి సరోజినీ , రామ్ జగన్, శివన్నారాయణ , గోపి నాయుడు లకు రాజబాబు స్మారక అవార్డులను భరద్వాజ , దాము , మాదాల రవి , ప్రసన్న కుమార్ ప్రదానం చేశారు .


పేద కళాకారులైన రమ్య చౌదరి , గోధురం మురళి , గోవా శర్మ, పొట్టి స్వామి, తెనాలి శకుంతల , తిరుపతి , కృష్ణవేణి ,దుర్గ నాగేశ్వర రావు , లక్ష్మి తులసి కి ఒక్కొక్కరికి పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని రాజబాబు కుటుంబ సభ్యులు రమేష్ చంద్ర , వెంకన్న చౌదరి ,శ్రీదేవి అందించారు .


జర్నలిస్ట్ రాంబాబు పుట్టినరోజు సందర్భగా.. తమ్మారెడ్డి భరద్వాజ, దాము ,ప్రసన్న కుమార్ , మాదాల రవి కాకాని బ్రహ్మం, రాజబాబు కుటుంబ సభ్యులు సత్కరించారు. సభకు ముందు రాజబాబు జీవితపై ఓ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు .

Related posts