telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జియోతో టీటీడీ కీలక ఒప్పందం…

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీటీడీకి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది. శ్రీ‌వారి ఆన్ లైన్ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో రిల‌య‌న్స్ జియో సంస్థ ప్ర‌తినిధుల‌తో టీటీడీ బోర్డు స‌మావేశమయ్యింది. ఇందుకు సంబంధించి టిటిడి- జియో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో ధర్మారెడ్డి జియో ప్రతినిధి అనిష్ ఎంఓయుపై సంతకాలు చేశారు.

అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ..కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారన్నారు. దీంతో టిటిడి సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పారు. గత నెలలో జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటల లోపు టికెట్ల బుక్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ యాప్‌లో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్ ను ఆవిష్కరించే ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా టిటిడికి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టిసిఎస్ సమన్వయంతో జియో సంస్థ ఉచితంగా టిటిడి ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు

Related posts