తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్పై ఇవాళ లేదా రేపు స్పష్టత ఇస్తామని ఆమె తెలిపారు.
జేఈఈ షెడ్యూల్ మారిన కారణంగా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని మంత్రి వెల్లడించారు.కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..
రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష కారణంగా షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. దీంతో.. తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు మారబోతున్నాయి.