ఈ నెల 25 వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను 17 న విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటినుంచి రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆయన ప్రకటించారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ.. . టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్ర స్థాయి నుంచి మొదలుకుని పట్టణ, మండల స్థాయి వరకు కమిటీ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
అలాగే.. అక్టోబర్ 25 న జనరల్ బాడీ మీటింగ్… ఆ తర్వాత పార్టీ ప్లీనరీ సమావేశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 15 న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన నిర్వహిస్తామన్నారు. ఈ విజయ గర్జనను విజయవంతం చేసేందుకు అక్టోబర్ 27 నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయని ప్రకటించారు కేటీఆర్. విజయ గర్జనలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కేటీఆర్ కోరారు.
అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్
అధ్యక్ష ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 17న షెడ్యూల్ విడుదల కానుంది.
22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
23న నామినేషన్ల పరిశీలన.
24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
25న జనరల్ బాడీ మీటింగ్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక.
ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించనున్నారు. 25న అధ్యక్ష ఎన్నిక ముగిసిన అనంతరం పార్టీ ప్లీనరీ సమావేశం కొనసాగనుంది. ఈనెల 17న పార్టీ అసెంబ్లీ, పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహించ నున్నామన్నారు. పార్టీకి సంబంధించిన తీర్మానాల కమిటీ ఛైర్మన్గా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి వ్యవహరించనున్నారని తెలిపారు.
రెడ్డి, వెలమలకు మూడు బలుపులుంటాయి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే