telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : బండి సంజయ్‌

BJP Bandi sanjay

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఎన్టీవీ తో మాట్లాడుతూ… మాది ఢిల్లీ పార్టీనే.. కానీ గడిల పార్టీ కాదని పేర్కొన్నారు. గల్లీ పార్టీలు గంగిరెద్దులను ఆడించే పార్టీలని… ఢిల్లీ పార్టీనే దుబ్బాకలో గెలిచిందని… గల్లీ పార్టీ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలన్నారు. పాతబస్తీకి రావాలంటే ఓవైసీ అనుమతి తీసుకోవాలంటే టీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని… తూట్ పాలిష్ మంత్రులు ఎందుకు మాట్లాడలేదని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలా? హైదరాబాద్ లో రెండు జెండాలు ఉండాలా? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలా? వద్దా? టిఆర్ఎస్ చెప్పాలని నిలదీశారు. ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించ లేదన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని స్పష్టం చేశారు. బస్తీ నిద్ర ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం ఉందని… గెలిచిన తర్వాత వారానికోసారి కార్పొరేటర్లు నిద్రించడం ద్వారా స్థానిక సమస్యలపై అవగాహన వస్తుందని తెలిపారు. బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా ఓటర్లు, ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఉపయోగపడుతుందని.. వరదల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదని మండిపడ్డారు. ఓట్లు వేయకపోయినా కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు దారి మళ్లించిందని ఫైర్‌ అయ్యారు.

Related posts