telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : “ఛలో ఇండియా” అంటూ ఇండియాను చుట్టేస్తున్న ఇంటి సభ్యులు

Bigg-Boss

బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం మ‌రింత ర‌సవ‌త్త‌రంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్ప‌టికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ‌, జాఫ‌ర్, త‌మ‌న్నా, రోహిణి, అషూ రెడ్డి బ‌య‌ట‌కి వెళ్ళారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది స‌భ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి స‌భ్యుల మ‌ధ్య నామినేష‌న్ ప్ర‌క్రియ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్ అని తెలిపారు బిగ్ బాస్. తాజాగా ఇంటి స‌భ్యుల‌కి ‘ఛలో ఇండియా’ అనే టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్ ప్ర‌కారం గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల‌కి తిరిగి రావాల‌ని చెప్తారు బిగ్ బాస్. ఈ ప్ర‌యాణంలో ఇంటి స‌భ్యులు చేసే ఓవ‌రాక్ష‌న్ ప్రేక్ష‌కుల‌కి కాస్త విసుగు తెప్పించాయి. 39వ ఎపిసోడ్‌లో శ్రీన‌గ‌ర్‌, చండీఘ‌ర్ చుట్టేసిన హౌజ్‌మేట్స్ నేటి ఎపిసోడ్‌లో మ‌రి కోన్ని ప్ర‌దేశాల‌కి వెళ్ళ‌నున్నారు.

ఎపిసోడ్ మొద‌ట్లో ఎలిమినేష‌న్ గురించి కొద్దిసేపు చ‌ర్చ‌లు జ‌రిపారు ఇంటి స‌భ్యులు. ఆ త‌ర్వాత బాబా భాస్క‌ర్ మంచిగా నిద్ర‌లోకి జార‌డంతో కుక్క‌లు మొరిగాయి. దీంతో వెంట‌నే లేచిన ఆయ‌న కాస్త క‌వ‌రింగ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో శివజ్యోతి ఆయ‌నకి చిన్న‌పాటి క్లాస్ పీకింది. ఇక ఆ త‌ర్వాత రాహుల్‌, పున‌ర్న‌వి మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు సాగాయి. కొద్ది సేప‌టి త‌ర్వాత లివింగ్ ఏరియాలో ఉన్న బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ‘ఛలో ఇండియా’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ట్రైన్ టూర్ మేనేజర్‌గా అలీ ఉంటాడు. ప్ర‌యాణం చేసే ప్ర‌యాణికుల‌లో తల్లీకూతుళ్లుగా శివజ్యోతి, వితికా.. హనీమూన్ కపుల్‌గా రవి, పునర్నవి.. అందమైన అమ్మాయిగా శ్రీముఖి.. ఆమెకి సైట్ కొట్టే ప‌నిలో అలీ ఉంటారు. ఇక అమాయకుడైన భర్తగా మహేష్, గడుసరి భార్యగా హిమజ.. ట్రైన్ డ్రైవర్స్‌గా వరుణ్, రాహుల్‌లు ఉంటారు. ఈ టూర్‌లో స్నాక్స్, ఆహారం అందించే బాధ్యతల్ని బాబా భాస్కర్‌కి అప్పగించారు.

పెళ్ళైన మూడు నెల‌ల త‌ర్వాత హ‌నీమూన్ ట్రిప్‌కి వెళుతున్న పున‌ర్న‌వి, ర‌విలతో మిగ‌తా హౌజ్‌మేట్స్ ప్ర‌యాణం చేశారు. ముందుగా శ్రీన‌గ‌ర్‌కి బ‌య‌లు దేర‌గా, ప్ర‌యాణంలో ర‌వి, పున‌ర్న‌విల రొమాన్స్.. అలీ, వితికా, శ్రీముఖిల మ‌ధ్య ఓర చూపులు.. హిమ‌జ వీరవిహ‌రం.. పెద్దావిడ‌గా శివ‌జ్యోతి ఓవరాక్ష‌న్ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. శ్రీ న‌గ‌ర్‌కి చేరుకోగానే బిగ్ బాస్ బాబా భాస్క‌ర్‌, శ్రీముఖికి టాస్క్ ఇచ్చారు. దీనికి సంచాల‌కులుగా అలీని నియ‌మించారు. క‌ళ్ళ‌కి గంత‌లు క‌ట్టుకొని యాపిల్స్‌ని నోటితో తీసి బాస్కెట్‌లో వేయాలి. ఎవ‌రైతే ఎక్కువ‌గా తీస్తారో వారే విజేత‌లుగా నిలుస్తార‌ని బిగ్ బాస్ తెలిపారు. బ‌జ‌ర్ మోగ‌గానే గేమ్ స్టార్ట్ చేసిన బాబాకి సావిత్రి సాయం చేయ‌గా, శ్రీముఖికి రాహుల్ స‌హాయ‌కుడిగా ఉన్నాడు. ఎండ్ బ‌జ‌ర్ మోగే స‌రికి బాబానే ఎక్కువ యాపిల్స్ తీయ‌డంతో ఆయ‌న‌ని విజేత‌గా ప్ర‌క‌టించారు బిగ్ బాస్‌. ఆ త‌ర్వాత టీం అంద‌రు చంఢీఘ‌ర్ బ‌య‌లు దేరారు.

చంఢీఘ‌ర్ ప్ర‌యాణంలోను వీరి ప‌ర్‌ఫార్మెన్స్ పీక్ స్టేజ్‌లోనే సాగింది. త‌మ న‌ట‌న‌తో పిచ్చి పీక్స్‌కి చేరేలా చేశారు. శ్రీముఖి, అలీ ఒక‌వైపు.. పున‌ర్న‌వి, ర‌వి కృష్ణ మ‌రోవైపు ప్రేక్ష‌కుల‌ని విసిగించారు. తెగ సిగ్గుప‌డుతూ, బుజ్జ‌గించుకుంటూ… చంఢీఘ‌ర్ చేరుకున్న త‌ర్వాత ర‌వికృష్ణ‌, మ‌హేష్‌కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. కోర్టు యార్డ్‌లో ఉన్న ల‌స్సీని ఎవ‌రు ఎక్కువ తాగితే వారే విజేత‌లు అని బిగ్ బాస్ తెలిపారు. దీనికి హిమ‌జ సంచాల‌కులుగా ఉన్నారు. ఆప‌సోపాలు ప‌డుతూ దాదాపు నాలుగు గ్లాసుల ల‌స్సీ తాగిన ర‌వికృష్ణ‌ని విజేత‌గా ప్ర‌క‌టించారు బిగ్ బాస్‌. మిగ‌తా లస్సీని ఇంటి స‌భ్యులు కూడా టేస్ట్ చేశారు. ఇక బిగ్ బాస్ “ఛ‌లో ఇండియా” టాస్క్‌లో ఒక అంకం ముగిసింది. రెండో వారం ఈ రోజు ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Related posts