గత రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం కురియడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు జ్జలమయమయ్యాయి. శనివారం ఉదయానికి నగరమంతా సగటున 7 సెంటీమీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లాలో సగటున 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరూర్ నగర్ చెరువుకు వెళ్లే ప్రధాన రహదారిపైకి రెండున్నర అడుగుల మేరకు నీరు చేరింది. ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు వాగులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది.