రాజధానిపై న్యాయపరంగా పోరాడతామని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తే ఊరుకోదని చెప్పారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? అని ప్రశ్నించారు. హైకోర్టు, సచివాలయం, రాజ్భవన్ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్ 5లో చెప్పారన్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలను విరమించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.మహిళలు, రైతులపై పోలీసుల చర్యలపై మానవహక్కుల సంఘాల నేతలు రంగంలోకి దిగుతారని తెలిపారు.
ఇష్టం వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడానికి వీల్లేదని, ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యల పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరన్నారు. వారు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాజధాని సమస్య కేవలం అమరావతికి చెందింది కాదని, రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.