తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి.ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు సభలో చర్చ జరగనుంది.
సభకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి మరికాసేపట్లో బీఏసీ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 14 పని దినాలకు తగ్గకుండా సమావేశాలు జరగనున్నాయి.