లాక్డౌన్ కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ కొనసాగుతుండగా, ఆ తర్వాత లాక్డౌన్ ఉంటుందా? లేదా సదలిస్తారా అన్న అంశంపై ఇప్పటివరకు స్పష్టతలేదు.
మరోపక్క కేంద్రం మే 3 వరకు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకటించినట్టు లాక్డౌన్ను సడలిస్తే మే మూడోవారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులంతా ఆన్లైన్ వీడియో పాఠాలు, దూరదర్శన్ యాదగిరి చానల్, టీసాట్, యూట్యూబ్ తదితరాల ద్వారా పరీక్షల కోసం సిద్ధం కావాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల బాగోగులు చూసుకోవాలని చెప్తున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు.