ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటే జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అధికారులతో సమావేశమవుతూ స్థానిక ఎన్నికల కోసం కొత్త షెడ్యూలు ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారని విమర్శించారు.
రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నారు. కరోనా వల్ల ఏర్పడుతున్న పరిస్థితుల నుంచి ఆయన నేర్చుకోవట్లేదని చంద్రబాబు ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను చంద్రబాబు పోస్ట్ చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో దక్షిణ కొరియాలో బాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని దుయ్యబట్టారు.