మండ్య నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ సినీ నటి సుమలతకు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. మాండ్యా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సుమలతకు బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు.
పలువురు సినీ ప్రముఖులు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు మద్దతు పలుకుతున్నారు. ఆమె కోసం ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్నారు. ‘కేజీఎఫ్’ హీరో యశ్ ఇప్పటికే సుమలతకు మద్దతు ప్రకటించగా, తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ముందుకొచ్చారు. మరోవైపు టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మోహన్బాబు కూడా సుమలతకు ప్రచారం చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖులందరూ సుమలత కోసం బరిలోకి దిగుతుండడంతో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.