ట్విటర్ వల్ల తనకు లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో ఇప్పటికీ తనకు అర్థమవ్వడం లేదని మంజ్రేకర్ అంటున్నాడు. సంజయ్ మంజ్రేకర్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. అతడికి కాస్త నోటి దురుసు ఎక్కువ. ఈ క్రమంలో కొన్నిసార్లు సహచరులు, ఆటగాళ్లపై చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో భారత స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజాపై చేసిన ‘బిట్స్ అండ్ పీసెస్’ అతడికి చేటు చేసింది. హర్ష భోగ్లేను అవమానిస్తూ మాట్లాడడం కూడా వివాస్పదం అయింది. దీంతో కొన్నాళ్లు వ్యాఖ్యానం చేయకుండా బీసీసీఐ నిషేధించింది. అయినా కూడా మంజ్రేకర్లో ఎలాంటి మార్పు రాలేదు. ‘ట్విటర్ రెండువైపులా పదునైన కత్తి. కొన్ని సందర్భాల్లో నాకు మంచి చేస్తే.. ఎక్కువ సార్లు చెడే చేసింది. సమతూకం కోసం ప్రయత్నించినా.. నష్టాన్నే ఎక్కువ కలిగించింది. సోషల్ మీడియా ఒక మృగంలా అనిపిస్తోంది. దానిని అర్థం చేసుకోలేకపోతున్నా. నేనెన్నో టెక్నిక్లు ప్రయత్నించాను. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెట్టాలో అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో మరి’ అని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
previous post
ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలొచ్చారు: కన్నా