చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పిచ్లు పేస్ బౌలింగ్కు అనుకూలం. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే భారత జట్టులో ప్రస్తుతం ఉన్న ఏకైక సీమ్ ఆల్రౌండర్ అతనే. అయితే గత కొద్దిరోజులుగా బౌలర్గా కాకుండా పాండ్యా కేవలం బ్యాట్స్మన్గానే సేవలందిస్తున్నాడు. కనీసం టీ20 మ్యాచ్లోనూ అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఫిట్గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లీ పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. అటు బ్యాట్స్మన్గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో టీమిండియా సెలెక్టర్ టెస్టు జట్టులో అతన్ని పక్కకు తప్పించారు. 2019 వరల్డ్ కప్ నుంచి అతను బౌలింగ్ చేసింది కూడా ఏం లేదు. సర్జరీ తర్వాత అతను బౌలింగ్ చేయడానికి సౌకర్యంగా కనిపించలేదు. దాంతో కేవలం బ్యాట్స్మన్గా ఎంపికచేయడానికి ఇష్టపడని సెలెక్టర్లు సంప్రదాయక ఫార్మాట్కు దూరం పెట్టారు.
previous post
next post