telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతి టేక్‌లోనూ గ్లిజరిన్ అవసరం లేకుండా నిజంగా ఏడ్చాను… ఎందుకంటే… : సమంత

Jaanu

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కి ఇది రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్‌నూ డైరెక్ట్ చేశారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచారం జోరు పెంచింది. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి విశాఖపట్నంలో జాను గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ ‘జాను’ సినిమా తన కెరీర్‌లో టాప్ 3 మూవీగా నిలిచిపోతుందని చెప్పారు. ‘96’ సినిమాను ఇప్పటికే చూసేసిన తెలుగు ప్రేక్షకులు ‘జాను’ను కూడా చూడొచ్చని భరోసా ఇచ్చారు. అదే కథలో ఒక కొత్త మ్యాజిక్ ‘జాను’ సినిమాలో ఉందని తాను నమ్ముతున్నట్టు వెల్లడించారు. ‘‘నేను ఈ సినిమాను అంగీకరించడానికి ముందు చాలా భయపడ్డాను. ఒక క్లాసిక్‌ను రీమేక్ చేస్తున్నారు.. వద్దులే నేను చేయకూడదు అనుకున్నాను. కానీ, తొలిరోజు షూటింగ్ నుంచే నాకు సినిమాపై పూర్తి నమ్మకం కలిగింది. అదే మ్యాజిక్.. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతిరోజూ నేను ఒక ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ప్రతి షాట్‌లో నిజంగా ఏడ్చాను. ఒక పది టేక్‌లు తీసుకుంటే ప్రతి టేక్‌లోనూ గ్లిజరిన్ అవసరం లేకుండా నిజంగా ఏడ్చాను. దీనికి కారణం స్క్రిప్ట్, డైలాగ్స్, లవ్‌లో ఉన్న పవర్. కాబట్టి, మీరంతా హ్యాండ్ కర్చీఫ్‌తో సినిమాకు రండి. ప్రతి ఒక్కరికీ కావాల్సి వస్తుంది’’ అని సమంత వెల్లడించారు. తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచిపోయిందని.. కానీ, ఇప్పటి వరకు శర్వానంద్‌తో ఒక్క సినిమా కూడా చేయలేకపోయానని అన్నారు సమంత. బహుశా ‘జాను’ కోసమే ఇప్పటి వరకు తాను శర్వాతో కలిసి నటించలేదేమో అని నవ్వుతూ చెప్పారు. తామిద్దరం కలిసి నడించడానికి ‘జాను’ కంటే గొప్ప సినిమా ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌ను తీసుకున్నందుకు దిల్ రాజు, డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కు సమంత థ్యాంక్స్ చెప్పారు.

Related posts