గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలోని ఓ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బస్తాల్లో ఉప్పు నింపుతున్న సమయంలో ఉన్నట్టుండి గోడకూలి అక్కడున్న వారిపైన పడింది. దీంతో అక్కడున్న 30 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటన గుజరాత్ మోర్బి జిల్లాలోని హల్వాద్ ప్రాంతంలో జరిగింది.
ప్రమాద ఘటన తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో వెలికితీస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాన మంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.