మయన్మార్ దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ చనిపోయినవారి సంఖ్య 48కి చేరుకుంది. అలాగే మోన్ రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడటంతో 16 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో 80 మంది గల్లంతైనట్లు సమాచారం.
దీంతో బురద, శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలను ప్రారంభించింది. విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇప్పటివరకూ వర్షాల కారణంగా మయన్మార్ లో 4,000 ఇళ్లు దెబ్బతినగా, 89,000 మంది నిరాశ్రయులు అయినట్లు అధికారులు వెల్లడించారు.