వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. సంపదను సృష్టించడం చేతగాక అప్పులు చేయడంకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా ? అని ప్రశించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. నాడు మీటర్ల బిగింపునకు వ్యతిరేకమన్నారు, నేడు మీటర్ల బిగింపుకు ఎందుకంత తొందర? అని ప్రశించారు. మీటర్లు లేకుండానే టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారని తెలిపారు.
అప్పులు తెచ్చుకోవడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా దేవినేని ఉమ పోస్ట్ చేశారు. నగదు బదిలీని ఏదైనా ఒక జిల్లాలో ఈ డిసెంబరులోగా అమలు చేయాలని కేంద్రం సూచించిందని, అయితే, మీటర్లు పెట్టకుండానే, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల నుంచే డిస్కమ్లకు నగదు బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయని కథనంలో పేర్కొన్నారు.