దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం తెలంగాణ పోలీసుల పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్ కౌంటర్ లో ప్రధానపాత్ర పోషించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు హీరో ఇమేజ్ వచ్చింది. సజ్జనార్ ను అభినందిస్తూ ప్రవాహంలా సందేశాలు వస్తున్నాయి.
ఇక ఆయన సొంతూరు కర్ణాటకలోని అసుతి గ్రామంలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. ఎన్ కౌంటర్ విషయం తెలియగానే ప్రజలు హర్షాతిరేకాలతో స్పందన వెలిబుచ్చారు. గ్రామస్తులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సజ్జనార్ ఇంటికి బంధుమిత్రులు, ఇతర గ్రామస్తులు పోటెత్తారు. దీనిపై సజ్జనార్ సోదరుడు ప్రకాశ్ స్పందించారు. తన సోదరుడు సజ్జనార్ ఎప్పుడూ సామాజిక న్యాయం గురించే తపించిపోయేవాడని అన్నారు. ఎన్ కౌంటర్ ఘటన పట్ల తాము గర్విస్తున్నామని చెప్పారు.