రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్. యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’.. శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది . ఈ మూవీ కోసం సినీప్రియులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

తెలుగునాట భారీ స్టార్డమ్ ఉన్న ఇద్దరు హీరోలు జూ.యన్టీఆర్, రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వాళ్ల క్రేజ్ ని బీట్ చేసే సత్తా ఉన్న డైరక్టర్ రాజమౌళి.. అంతేకాకుండా తెలుగునాట పోరాట యోధులుగా నిలచిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని మొదటి నుంచీ వినిపించడంతో అందరిలోనూ మరింత ఆసక్తి నెలకొంది.

కథ..
స్వాతంత్రానికి పూర్వం 1920లో అదిలాబాద్ జిల్లాలో కథ ప్రారంభం అవుతుంది. బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న రోజులవి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్చరణ్) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు.
రామరాజు, భీమ్ ఇద్దరికీ చిన్న తనం నుంచీ పోరాడే తత్వం ఉంటుంది. రామరాజుకు పోలీస్ కావాలన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గవర్నమెంట్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ అవుతాడు. ఇక భీమ్ తన జాతి గౌరవం కోసం శ్వాసనైనా విడిచే రకం. భీమ్ గోండు జాతికి చెందిన ఓ పచ్చబొట్లు పొడిచే మల్లి అనే చిన్న పిల్లను బ్రిటిష్ ఆఫీసర్ భార్య తమతోనే ఉంచుకుందామని బలవతంగా తీసుకువెళ్తుంది. అడ్డుపడిన తల్లిని చంపేస్తారు బ్రిటీషర్స్. ఆ పాపను కాపాడటానికి ఆ తెగ నాయకుడు భీమ్ (ఎన్టీఆర్) డిల్లీ బయిలుదేరతాడు.
ఇదిలా ఉంటే ఓ సందర్భంలో ఇన్ స్పెక్టర్ రామ్, కొమరం భీమ్ కలుసుకుంటారు. వారిద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. ముస్లిమ్ లాగా కనిపించే భీమ్, చలాకీగా ఉండే రామ్ ఇద్దరూ తమ అసలు లక్ష్యాలను చెప్పుకోరు. కానీ, వారి స్నేహబంధం మాత్రం చెరిగిపోనిది. బ్రిటిష్ జనాన్నీ వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ఓ సందర్భంలో తమ డాన్సుల్లాగా మీ నాట్యం ఉండదు అని బ్రిటిష్ వాళ్ళు గేలి చేస్తారు. దాంతో ఈ ఇద్దరు మిత్రులు తమ ‘నాటు’ డాన్స్ తో రక్తి కట్టిస్తారు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి స్నేహబంధాన్ని విధి విడదీసే ప్రయత్నం చేస్తుంది. తమ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న గోండు నాయకుడు భీమ్ ను పట్టుకోవాలని గవర్నమెంట్ భావిస్తుంది.
అదే సమయంలో రామ్ రాజు (రామ్ చరణ్) బ్రిటీష్ వారి వద్ద పోలీస్ గా పనిచేస్తూంటాడు. అతనికి భీమ్ ని పట్టుకునే భాధ్యత అప్పగించబడుతుంది. రామ్ మామూలువాడు కాదు. చాలా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నవాడు. భీమ్ ఒంటి చేత్తో పులిని పడేయగలడు.
అయితే భీమ్ ను బంధించి తెస్తే, మరింత ఉన్నత స్థానానికి వెళతావనీ ప్రభుత్వం హామీ ఇస్తుంది. దాంతో రామ్ ఉత్సాహంగా భీమ్ ను పట్టుకొనే ప్రయత్నం మొదలు పెడతాడు. అలా రామ్ కు తన మిత్రుడే భీమ్ అన్న విషయం తెలుస్తుంది. అలాగే భీమ్ తన స్నేహితుడే బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ రామ్ అని తెలుసుకుంటాడు. తనను రామ్ మోసం చేశాడని భీమ్, తన వద్ద భీమ్ రహస్యం దాచాడని రామ్ భావిస్తారు. ఎవరికి వారు ద్రోహానికి గురయ్యామని భావించి, ఇద్దరూ పోట్లాడుకుంటారు. అప్పటివరకూ ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ ఇద్దరు మిత్రుల నడుమ పోరు చూస్తే మనసులు ద్రవిస్తాయి. చివరకు తమ పోరుకు కారణం తమలోని స్నేహమే అని భావిస్తారు. రామ్ ఉద్యోగ ధర్మంతోనే తనతో పోరాడాడు అని అర్థం చేసుకున్న భీమ్ స్నేహానికి కట్టుబడి లొంగిపోతాడు.
రామ్ తనను బంధించడం వల్ల అతను ఉన్నతస్థానం చేరుకుంటాడని భీమ్ భావిస్తాడు. అలాగైనా బందీగా ఉన్న తమ జాతి అమ్మాయిని కలుసుకోవచ్చునని భావిస్తాడు. కానీ, ప్రభుత్వం భీమ్ కు ఉరిశిక్ష విధిస్తుంది. భీమ్ పోరాట పటిమ గురించి మొదటి నుంచీ వింటున్న బ్రిటిష్ జెన్నీఫర్ కు కూడా ఈ విషయం తెలుస్తుంది. తన మిత్రుడు స్నేహం కోసం లొంగిపోతే, అతణ్ని ఉరితీయడం సరికాదనే వేదన రామ్ లో మొదలవుతుంది. చిన్నతనం నుంచీ పోలీస్ కావాలన్న తనలోని తపనను గమనించి, పోలీస్ కంటే పెద్ద అయిన ఇన్ స్పెక్టర్ కావాలని సూచించిన గురువు గుర్తుకు వస్తాడు. వృత్తిధర్మంలో ఏ నాడూ వెనుకంజ వేయరాదని చెప్పిన గురువు, ఎప్పటికీ అన్యాయానికి తలవగ్గవద్దనీ బోధించి ఉంటాడు. ఆ విషయాలు గుర్తుకు వచ్చి, వృత్తి ధర్మం పాటిస్తూ భీమ్ కు అన్యాయం చేస్తున్నానని ఆలోచించలేదని బాధపడతాడు రామ్. జెన్నీఫర్ సూచించిన ఓ పథకం ప్రకారం రామ్, భీమ్ ను, గోండు జాతి పాపను రక్షిస్తాడు. చిన్నతనం నుంచీ తన బావ రామ్ పై పంచ ప్రాణాలు పెట్టుకున్న సీత అతను పెద్ద ఆఫీసర్ అయ్యాడన్న ఆనందంతో వస్తుంది. అయితే భీమ్ తప్పించుకోవడానికి కారణం రామ్ అని, అతణ్ని చిత్రహింసల పాలు చేస్తుంటారు బ్రిటిష్ సైనికులు. ఓ సందర్భంలో భీమ్, సీత కలుసుకుంటారు. ఆ సమయంలోనే పోలీస్ ఇన్ స్పెక్టర్ అయిన తన బావ రామ్ ను బ్రిటిష్ ఉద్యోగులు చిత్రహింసలు చేస్తున్నారని చెబుతుంది. మిత్రుడు భీమ్ ని రామ్ తప్పించాడనే తెల్లవాళ్ళు రామ్ ను చంపబోతున్నారని చెప్పి విలపిస్తుంది.
అప్పటి వరకూ రామ్ తనకు మిత్రద్రోహం చేశాడని భావించిన భీమ్ అసలు విషయం తెలుసుకోగానే స్నేహితుణ్ణి విడిపించేందుకు పరుగు తీస్తాడు. ఆ క్రమంలో రామ్ కు గాయాలు అవుతాయి. రామ్ గాయాలను మానటానికి భీమ్ తోడ్పడతాడు. అప్పటి దాకా వృత్తి ధర్మం అని భావించిన రామ్, తన జాతి కోసం తపించిన భీమ్, దేశం కోసం ప్రాణాలు పోయినా పరవాలేదని భావించి, తెల్లవారిని దేశం నుండి పారద్రోలే ప్రయత్నిస్తారు. విజృంభిస్తారు. బ్రిటిష్ వారి కీలక కేంద్రాలపై దాడులు సాగిస్తారు. ఎప్పటికప్పుడు తమ వ్యూహాలతో తెల్లవారిని చిత్తు చేస్తూ పోతారు. పరాయి పాలన నుండి దేశమాత దాస్యశృంఖలాలను ఛేదించడం కోసం రామ్, భీమ్ వంటి పోరాట యోధులూ ఉన్నారన్న సత్యాన్ని చాటుతూ కథ ముగుస్తుంది. మొత్తంగా.. రామ్, భీమ్ ల స్నేహం, ఇద్దరూ కలిసి బ్రిటీష్ ప్రభుత్వంపై ఎలా పోరాడారు అనేదే ఈ సినిమా కథాంశం.
విశ్లేషణ..
ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమాలు తీయటం అంటే మాటలు కాదు..రాజమౌళి ఏ సినిమా తీసినా, దానిని జనం మెచ్చేలా వేరే లేవల్లో తీసుకువెళతాడనేది మరోసారి నిరూపించారు. ఆయనకి ఎన్టీఆర్, రామ్చరణ్లాంటి మంచి నటులు కూడా తోడయ్యారు. వాళ్ల అభినయం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఆద్యంతం హృదయాల్ని పిండేసేలా ఉంటాయి. మామూలుగానే కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తోంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిప్పు, నీరు… అంటూ రెండు శక్తుల్ని పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించారు దర్శకుడు. ఆ శక్తులకి తగ్గట్టే ఉంటాయి పరిచయ సన్నివేశాలు.

ముఖ్యంగా యన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఇంట్రవెల్ కు ముందు చోటు చేసుకున్న పోరాట దృశ్యాలు చూపరులకు ‘గూస్ బంప్స్’ తెప్పిస్తాయి.చిన్నకథనైనా జనరంజకంగా మలచడంలో దిట్ట రాజమౌళి. ఆ విషయాన్ని ‘ఆర్.ఆర్.ఆర్.’తో మరోమారు నిరూపించుకున్నారాయన. ముఖ్యంగా జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని వారి అభిమానులు ఎవరూ నిరాశ చెందకుండా ఉండేలా కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

ఆలియా భట్ పాత్ర నిడివి తక్కువే. కానీ, తెరపై కనిపించిన ప్రతిసారీ తన ఉనికి చాటుకున్నారు. సీత పాత్రకు ఆమె అభినయం ప్లస్ అయ్యింది. ఒలీవియా మోరిస్ అందంగా కనిపించారు. అజయ్ దేవగణ్ పాత్ర నిడివి కూడా తక్కువే. కానీ, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

రెండు శక్తులు ఒకదానికొకటి తలపడితే అది ఎంత భీకరంగా ఉంటుందో చూపిస్తూ రామరాజు, భీమ్ మధ్య సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పవర్ ఫుల్ గా , కళ్లు తిప్పుకోనివ్వని స్దాయిలో ఉండటం దర్శకుడు పని తీరు అని చెప్పాలి.
ఎన్టీఆర్, చెర్రిపోటాపోటీగా..
కొమరం భీమ్ గా జూ.యన్టీఆర్, రామరాజుగా రామ్ చరణ్ నటించలేదు, ఆ పాత్రలే కనిపించేలా అభినయించారు. ఇద్దరూ పోటాపోటీగా తమ పాత్రలను నిర్వహించారని చెప్పవచ్చు. సినిమాను బాగా గమనిస్తే ఇందులోని ప్రధాన పాత్రల నేపథ్యంలో పంచభూతాలు మనకు కనిపిస్తాయి. గోండు జాతి పసిపాప నింగి అయితే, రామరాజు పాత్రలో అగ్ని, భీమ్ పాత్రలో జలం కనిపిస్తాయి.
ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడి చేసారు. దర్శకుడుగా రాజమౌళికు ఈ ఇద్దరితో చేసిన అనుభవంతో వాళ్ల బలాలు,బలహీనతలు తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ డిజైన్ చేయటంతో ఫెరఫెక్ట్ గా ఆ పాత్రలకు మ్యాచ్ అయ్యారు. ఎన్టీఆర్ పాత్ర కాస్త ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కథకు ఎమోషన్ ఆర్క్ ఇచ్చేది ఆ పాత్రే కాబట్టి. ఇక ఎన్టీఆర్ ఇంట్రో, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కొమరం భీముడో సీక్వెన్స్ ఎన్టీఆర్ ని నెక్ట్స్ లెవిల్ లో చూపెడతాయి.అలాగే తన ఎదురుగా ఉన్న మరో స్టార్ ని నటనతో తినేయకుండా బాలెన్స్ చేసుకుంటూ ఎన్టీఆర్ ముందుకు వెళ్లారు. ఫస్టాఫ్ ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తే..సెకండాఫ్ రామ్ చరణ్ తనేంటో ,తన కెపాసిటీ ఏంటో చూపిస్తే ముందుకు వెళ్తారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కథలోంచి తీసుకుని ..చాలా బాగా డిజైన్ చేసారు. ఆ విధంగా చూస్తే ఎన్టీఆర్ ఇంట్రడక్షనే కాస్త సినిమాటెక్ గా అనపిస్తుంది. కానీ చాలా బాగుంది. హై మూమెంట్స్ కూడా ఇద్దరికి ఫెరఫెక్ట్ గా షేర్ చేయటంతో ఇద్దరిలో ఒకరే బాగా చేసారని ఎక్కడా చెప్పలేని విధంగా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ కు ఈ ఇద్దరి హీరోలను తప్పించి వేరే వాళ్లను ఊహించుకోలేమన్నట్లుగా ఉంది.
ఓవరాల్ గా…
ఆర్.ఆర్.ఆర్ అధిరిపోయింది. హీరోలు ఇద్దరి నుంచి నటనాపరంగా ఎంత పిండాలో అంత రాజమౌళి తీసుకున్నారు. ఎపిసోడ్స్ వైజ్ గా సినిమా నచ్చుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లు చాలా బాగా డిజైన్ చేసారు. ఇందులో యన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఏమాత్రం నిరాశ చెందకుండా వారి పాత్రలను మలచిన తీరు అభినందనీయం.
ప్లస్ పాయింట్స్..
*ఎన్టీఆర్
*రామ్ చరణ్
*ఇద్దరు పోరాట యోధుల పేర్లతో ప్రధాన పాత్రలు ఉండడం
ఇద్దరి హీరోలు ఇంట్రో సీన్స్, వాళ్లకు ఇచ్చే ఎలివేషన్స్
ప్రీ ఇంట్రవెల్ ఎపోస్డ్, ఇంట్రవెల్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్..
హీరోల ఎంట్రీ ఆలస్యంగా ఉండడం
కొన్ని ఫోర్సెడ్ ఎమోషన్స్
సీతగా అలియాభట్ క్యారక్టర్ కు పెద్దగా ప్రయారిటీ లేకపోవటం

