యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రెబల్స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ పాన్-ఇండియా ఫిలింగా తెరకెక్కుతోంది. ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సచిన్ ఖేడేకర్, మురళీశర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 1970ల్లో యూరప్లో జరిగిన ఒక రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్కు ముందు జార్జియాలో షూటింగ్ చేశారు. అక్కడ కూడా ప్రభాస్, పూజా హెగ్డేలపై సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ ఇప్పుడు లాక్డౌన్ తరవాత ఇటలీలో షూటింగ్ షురూ చేశారు. ‘రాధే శ్యామ్’ షూటింగ్లో పాల్గొనడానికి ఇప్పటికే ప్రభాస్ ఇటలీ వెళ్లారు. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఇటలీలో అడుగుపెట్టారు. ‘రాధే శ్యామ్’ షూటింగ్లో ఆమె పాల్గొనబోతున్నారు. పూజ ఇటలీ వెళ్లిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చిన్న వీడియోను పోస్ట్ చేశారు. “హలో ఇటలీ” అని క్యాప్షన్ పెట్టి తాము షూటింగ్ చేయబోయే అందమైన ఇళ్లను వీడియోలో చూపించారు. లాక్డౌన్ తరవాత ప్రభాస్ కెమెరా ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి. పూజా హెగ్డే మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అక్కినేని అఖిల్తో కలిసి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ను పూర్తిచేసుకున్న పూజా ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ను పూర్తిచేయడానికి ఇటలీ వెళ్లారు.
next post