అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులకు పిచ్చెక్కిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. మద్యం విక్రయాల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వంపై బోండా ఉమ చేసిన తీవ్ర ఆరోపణలపై ఆమె మండిపడ్డారు.
ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా బోండా ఉమ ప్రెస్ మీట్ ఉందని ధ్వజమెత్తారు. మందు బాటిళ్లను టీడీపీ ఆఫీస్లో ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కార్యాలయంలో లిక్కర్ బ్రాండ్స్ ను తన ముందు పెట్టుకుని కూర్చున్న బోండా ఉమ.. వైన్ షాపులోనో, బార్ లోనో ఓ సేల్స్ మెన్ లా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే కల్లు తాగిన కోతులు ఎలా వ్యవహరిస్తాయో టీడీపీ నేతలూ అలా వ్యవహరించారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.