అనసూయ భరధ్వాజ్ ఇటు యాంకర్గా రాణిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర మీద కూడా తళుక్కున మెరుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్, హీరో రామ్చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా నటించి అందరినీ బుట్టలో పడేసింది. ఆ పాత్ర అనసూయకు ఎనలేని క్రేజ్ను తెచ్చిపెట్టింది. వరుస ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి. అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కరోనా కాలానికి సంబంధించిన కాల్పనిక ఘటనలను ఆధారం చేసుకొని క్రియేటివ్ జీనియస్ అయిన రమేష్ రాపర్తి ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టైటిల్ పోస్టర్ను బట్టి తెలుస్తోంది.ఈ టైటిల్ పోస్టర్ను హీరో రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఆ పోస్టర్లో ఓ లిఫ్ట్, దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తున్నాయి. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రానా షేర్ చేసిన వీడియోలో యూనిట్ మెంబర్స్ను ఒక్కొక్కరినే మాస్క్ పెట్టుకోమని అడిగి, వారు మాస్క్ పెట్టుకోగానే థ్యాంక్ యు బ్రదర్ అని చెప్పడం కరోనా కాలంలో మాస్క్ ప్రాధాన్యాన్ని చెప్తున్నట్లే కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post
ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల