తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలే కాదు శివకుమార్ విద్యా ట్రస్ట్, అగరం ఫౌండేషన్ ద్వారా తన శక్తి మేర సమాజ సేవ కూడా చేస్తున్నారు. అందులో భాగంగా శివకుమార్ విద్యా ట్రస్ట్, అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉతీర్ణత సాధించిన పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించారు హీరో సూర్య. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షపై అనుసరించనున్న విధానంతో పాటు విద్యా విధానంలో మూడు భాషలను నేర్చుకోవాలని చెప్పడంపై హీరో సూర్య కొన్ని రోజుల క్రితం స్పందించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం సరైంది కాదంటూ ఆయన తెలియజేశారు. సూర్య వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీజేపీ నాయకులు సూర్యకు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విమర్శించేంత అర్హత ఎక్కడుంది? అంటూ విమర్శలు చేశారు. మరో అడుగు ముందుకేసి సూర్య సతీమణి సినిమా విడుదలను అడ్డుకున్నారు. అయితే సూర్య వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టగా… ఆయన సన్నిహితులు మాత్రం స్వాగతించారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటంటూ సూర్యకు తన మద్దతుని తెలియజేశారు. ఈ క్రమంలో సూర్య ఓ భావోద్వేగ లేఖను రాసి ట్విట్టర్ వేదికగా రాశారు. ఆ లేఖలో “ప్రతి పేదవాడికీ విద్యనభ్యసించే హక్కు ఉంది. అలాగే భారతీయ పౌరుడిగా నాకు మాట్లాడే హక్కు ఉంది. విద్యా వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు గురించి మాట్లాడితే తప్పేంటి.. నన్ను టార్గెట్ చేయడం నాకు బాధను కలిగించింది” అని సూర్య పేర్కొన్నారు. ఇప్పుడు సూపర్స్టార్ రజనీకాంత్ కూడా తన మద్దతుని తెలియజేశారు. సూర్య బందోబస్త్ సినిమా ఆడియో వేడుకకి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “సూర్య అగరం ఫౌండేషన్ను స్టార్ట్ చేసి విద్యార్థులకు విద్యను అందిండంలో తోడ్పడుతున్నారు. అక్కడి విద్యార్థులు కొత్త విద్యావిధానం వల్ల పడే ఇబ్బందులను చూసే ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు మాట్లాడే అర్హత ఉంది. ఆయన మాటలను నేను సమర్ధిస్తున్నాను” అంటూ తన మద్దతుని తెలియజేశారు రజనీకాంత్
previous post