రైల్వే శాఖ ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మధ్య ప్రయాణాన్ని ఐదు గంటలు తగ్గించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో దాదాపు రూ.14 వేల కోట్లను వెచ్చించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆగస్టు 31 కల్లా ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని రైల్వేకు ఆదేశాలు వెళ్లాయి.
ప్రస్తుతం ఢిల్లీ-హౌరా మధ్య ప్రయాణానికి 17 గంటల సమయం పడుతుండగా, ఢిల్లీ-ముంబై మధ్య 15.5 గంటలు పడుతోంది. ఈ రెండు మార్గాల్లోనూ 30 శాతం ప్రయాణికులు, 20 శాతం సరుకు రవాణా ట్రాఫిక్ ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే తాజా ప్రతిపాదనతో ఢిల్లీ-హౌరా మధ్య ప్రయాణ దూరం 12 గంటలకు, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ దూరం 10 గంటలకు తగ్గనుంది.